రాహుల్‌ని ప్రధాని చేసైనా మేమనుకున్నది సాధిస్తాం: రేవంత్

Revanth Reddy

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కులగణన జరగాలని జోడో యాత్రలో రాహుల్‌గాంధీ డిమాండ్ చేసిన విషయాన్ని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  గుర్తు చేశారు. రాహుల్ ఆశయం మేరకు మేం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చామని తెలిపారు. బిసి రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేస్తున్న మహాధర్నా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్న బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించామని అన్నారు. అసెంబ్లీ పంపిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. బిల్లులు పంపించి 4 నెలలు గడిచినా రాష్ట్రపతి ఆమోదించలేదని ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించాలని రాష్ట్రపతిని కోరుతున్నామని రేవంత్ (Revanth Reddy) అన్నారు. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావించి రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరామని.. కానీ, ఇప్పటివరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ మాకు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై మోదీ ఒత్తిడి చేశారని తమ అనుమానమని అన్నారు. బిల్లులు ఆమోదించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బిసిల రిజర్వేషన్ల పెంపు అంశంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరగాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని తెలిపారు. మోదీని గద్దె దించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసైనా మేం అనుకున్నది సాధిస్తామని హెచ్చరించారు. ముస్లింలను బూచీగా చూపి బిసి బిల్లును అడ్డుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *