
గత కొంతకాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న బెదిరింపులు బాలీవుడ్ ప్రముఖులను నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా, రణవీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు ‘హరి బాక్సర్’ అనే వ్యక్తి నుంచి ప్రాణహాని తలపెట్టేలా ఆడియో మెసేజ్ వచ్చింది. గతంలో రోహిత్ శెట్టి నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో కూడా ఇతని పేరు వినిపించడం గమనార్హం. ఇప్పుడు ఈ లైన్ లోకి రణవీర్ సింగ్ కూడా చేరారు..
Also Read : Malavika Mohanan : రూమర్లకు మాళవిక మోహనన్ చెక్.. ‘ది రాజా సాబ్’ స్టంట్స్ నావే!
తాజాగా రణవీర్ సింగ్ కి కూడా బెదిరింపులు వచ్చాయి. అయితే గతంలో ఇచ్చిన ఒక కమిట్మెంట్ విషయంలో వెనక్కి తగ్గడం వల్లే ఈ బెదిరింపులు వస్తున్నట్లు ఆ ఆడియోలో పేర్కొన్నారు. ‘‘రణవీర్ సింగ్.. నీ ఏడు తరాలు గుర్తుంచుకునేలా నీకు బుద్ధి చెబుతాం. నీ దగ్గర పనిచేసే మేనేజర్లు, సిబ్బంది వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. వాళ్లు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఆఫీస్ కి వస్తారు అనే విషయాలు మాకు తెలుసు. నిన్ను నేరుగా ఏమీ చేయం.. కానీ నీ కింద పనిచేసే ప్రతి ఒక్కరినీ చంపేస్తాం. అప్పుడు గానీ నీకు బుద్ధి రాదు’’ అంటూ హరి బాక్సర్ అత్యంత భయంకరంగా హెచ్చరించాడు.
అంతేకాకుండా, మొత్తం హిందీ చిత్ర పరిశ్రమకే ఈ హెచ్చరికలు వర్తిస్తాయని, తమ మాట వినని వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. గతంలో కపిల్ శర్మ కేఫ్ వెలుపల జరిగిన కాల్పులు కూడా సల్మాన్ ఖాన్కు ఇచ్చిన ఆహ్వానం వల్లే జరిగాయని ఈ గ్యాంగ్ గతంలో పేర్కొంది. ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ ఆడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.






