
దేశవ్యాప్తంగా మహా శివరాత్రి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ‘ఓం నమః శివాయ’ మంత్రంతో శివాలయాలన్నీ మారుమోగుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున సినీ తారలు కూడా తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా శివుడిపై తనకున్న అపారమైన భక్తిని ఒక అందమైన పాట రూపంలో వ్యక్తపరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read : Polimera 3 : పొలిమేర 3 అప్డేట్.. ఈసారి ట్విస్ట్ మామూలుగా లేదు!
రాశీ ఖన్నా కేవలం నటిగానే కాకుండా మంచి గాయని అని మనకు తెలుసు. అయితే ఈ శివరాత్రికి ఆమె ‘శివ్ కైలాషోం కే వాసి’ అనే ప్రసిద్ధ శివ గీతాన్ని ఆలపించి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె మధురమైన గాత్రం విన్న అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ పాటను షేర్ చేస్తూ రాశీ ఖన్నా ఒక ఎమోషనల్ నోట్ కూడా రాశారు..‘ఈ దివ్యమైన రోజున మహాదేవుడికి నా ప్రార్థనగా ఈ గీతాన్ని అర్పిస్తున్నాను. ఇది కేవలం పాట మాత్రమే కాదు.. నా విశ్వాసం, నా అంతరంగాన్ని మేల్కొల్పే ఒక అనుభూతి. అతీంద్రియ శక్తి అయిన మహా దేవుడి మీద నా భక్తిని చాటే ఈ ప్రయత్నం నా మనసుకి ఎంతో దగ్గరైన కల. శివరాత్రి రోజున ఇలా పాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా పాడిన ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతోంది. ఆమెలోని ఈ ఆధ్యాత్మిక కోణాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాల విషయానికొస్తే, రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.





