
మాఘ మాసంలోని బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది శివ భక్తులందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక సంబరం. ఈ ఏడాది ఫిబ్రవరి 15, 2026 ఆదివారం నాడు భక్తులు ఈ పవిత్ర దినాన్ని జరుపుకోనున్నారు. ముక్కంటిని కొలిచే భక్తులకు ఏడాదంతా వచ్చే మాస శివరాత్రులు ఒక ఎత్తు అయితే, ఈ మహాశివరాత్రి మరొక ఎత్తు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజని కొందరు, శివుడు లోకకళ్యాణం కోసం గరళాన్ని మింగిన రోజని మరికొందరు.. ఇలా ఎన్నో పురాణ గాథలు ఈ పర్వదినంతో ముడిపడి ఉన్నాయి.
ఉపవాసం – జాగరణ: అసలైన అంతరార్థం:
మహాశివరాత్రి రోజున ప్రధానంగా పాటించే నియమాలు ఉపవాసం, జాగరణ. శాస్త్ర ప్రకారం ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే ఉండటం. అంటే ఆహారాన్ని వదిలి రోజంతా ఆ పరమేశ్వరుడి ఆలోచనలతోనే ఆయనకు మానసికంగా దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం. ఇక జాగరణ అంటే రాత్రి నిద్రపోకుండా కేవలం మేలుకోవడమే కాదు, మనసులోని అజ్ఞానమనే నిద్రను వీడి, జ్ఞానమనే వెలుగు వైపు అడుగులు వేయడం. రాత్రంతా శివనామ స్మరణ, భజనలు, శివ పురాణ పఠనంతో గడిపితేనే ఆ పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
అభిషేక ప్రియుడు.. అల్ప సంతోషి:
భోళాశంకరుడు ‘అభిషేక ప్రియుడు’. ఆయనను కొలవడానికి పెద్ద పెద్ద ఆడంబరాలు అక్కర్లేదు. మనసు నిండా భక్తితో ఒక చెంబు నీరు పోసి, మూడు ఆకులున్న మారేడు దళాన్ని (బిల్వ పత్రం) సమర్పిస్తే చాలు, ఆయన పొంగిపోతాడు. లింగోద్భవ కాలంలో (అర్ధరాత్రి సమయంలో) చేసే రుద్రాభిషేకం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. పంచామృతాలు, పాలు, గంగాజలంతో చేసే ఈ అభిషేకాలు మన మనస్సును, ఆత్మను శుద్ధి చేస్తాయి.
శివ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ:
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం, అరసవెల్లి నుండి దక్షిణాన శ్రీశైలం, ఉత్తరాన కాశీ వరకు అన్ని శైవ క్షేత్రాలు ‘హర హర మహాదేవ’ అనే నామస్మరణతో మారుమోగుతాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, నుదుట విభూతిని ధరించి, త్రయంబక మంత్రాన్ని జపిస్తూ భక్తులు శివలింగ దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా లింగోద్భవ కాలంలో శివ దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని పెద్దల నమ్మకం. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినం మనందరి జీవితాల్లోని చీకట్లను తొలగించి, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుందాం.






