
Katihar Fire Accident: బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుర్సెలా లోని షహీద్ చౌక్ స్టేట్ హాట్ మార్కెట్లో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 500 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారాలు క్షణాల్లో కళ్ల ఎదుటే బూడిద కావడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆదివారం సాయంత్రం 7:30 గంటల సమయంలో మార్కెట్ కొనసాగుతున్న వేళ.. ఓ బట్టల దుకాణంలో మొదలైన మంటలు వేగంగా మార్కెట్ మొత్తం వ్యాపించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మంటలు వేగంగా పెరగడంతో ఎవరికీ స్పందించే అవకాశం కూడా లేకుండా పోయిందని తెలుస్తోంది. టిన్, గడ్డితో నిర్మించిన దుకాణాలు వరుసగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్, కూరగాయలు, మొబైల్ ఇలా పలు రకాల దుకాణాలు కొద్దిసేపట్లోనే శిథిలాలుగా మారిపోయాయి.
అగ్నిజ్వాలలు అంత తీవ్రంగా ఉండటంతో సుమారు 5 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఆకాశం ఎర్రగా కనిపించింది. ఈ ఘటనతో నేషనల్ హైవే-31, స్టేట్ హైవే-77 ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనడంతో అధికారులు ట్రాఫిక్ను నిలిపివేశారు. సమీపంలోని పక్కా ఇళ్లలో నివసించే ప్రజలు భయంతో తమ సామాన్లను బయటకు తరలించారు. మొత్తం కుర్సెలా పరిసర ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
India vs Pakistan History: ఫిబ్రవరి 15.. అదే తేదీ, అదే చరిత్ర! మళ్లీ టీమిండియాకు టైటిల్పై భయం?
స్థానికుల ఆరోపణల ప్రకారం మొదట చిన్న ఫైర్ బ్రిగేడ్ వాహనం మాత్రమే సంఘటన స్థలానికి చేరుకుంది. ఆ వాహనంలోని నీరు త్వరగా అయిపోవడంతో మంటలను అదుపులోకి తేవడం కష్టమైంది. తరువాత కటిహార్ నుంచి పెద్ద అగ్నిమాపక వాహనాలు చేరుకున్నప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. గంటలపాటు చేసిన ప్రయత్నాల తరువాతే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అగ్నిప్రమాదంలో రూ.7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా బట్టలు, కాస్మెటిక్ దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి ప్రభుత్వ సహాయాన్ని త్వరలోనే అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.





