
దశాబ్దాలుగా తన స్వరాలతో సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న సంగీత జ్ఞాని ఇళయరాజాకు న్యాయస్థానంలో ఊహించని పరిణామం ఎదురైంది. తన కంపోజిషన్లపై పూర్తి అధికారం తనదేనని ఆయన చేస్తున్న పోరాటంలో భాగంగా, ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Abhishek Bachchan: కొత్త హెయిర్ స్టైల్ వెనుక అసలు రహస్యం ఇదే!
సంగీత హక్కుల విషయంలో ప్రముఖ ఆడియో సంస్థ ‘సరిగమ’,ఇళయరాజా మధ్య జరుగుతున్న వివాదంలో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా బాణీలు అందించిన 134 చిత్రాలకు సంబంధించిన ఆడియో హక్కులు సదరు సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వత ప్రాతిపదికన సరిగమకు విక్రయించిన నేపథ్యంలో, ఇప్పుడు వాటిపై ఇళయరాజాకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని జస్టిస్ తుషార్ రావు గెడేలా వెల్లడించారు.
నిజానికి, ఈ పాటలను వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్లో వాడుకోవడానికి ఇళయరాజా ఈ మధ్యే అనుమతులు ఇవ్వగా, దానిని సరిగమ సంస్థ సవాల్ చేసింది. కాపీరైట్ చట్టం ప్రకారం.. నిర్మాత వద్ద వేతనం తీసుకుని కంపోజ్ చేసిన పాటలపై హక్కులు నిర్మాతకే ఉంటాయని , ఆయన ద్వారా ఆ హక్కులు పొందిన సంస్థకే పూర్తి అధికారం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ‘ఎప్ ఇనియా పొన్ నిలవే’ వంటి ఆల్ టైమ్ హిట్ సాంగ్ వివాదంలో మొదలైన ఈ చట్టపరమైన పోరాటం,ప్రస్తుతానికి ఇళయరాజాకు ప్రతికూలంగా మారింది. అయితే దీనిపై ఆయనపై కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉంది.





