
BJP MLA Corruption: కర్ణాటక రాష్ట్రంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శిరహట్టి అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణి లంచం తీసుకుంటూ లోకాయుక్తా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఓ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్ట్ కోసం పూజారి అనే క్లాస్-1 కాంట్రాక్టర్ చంద్రు లమాణిని సంప్రదించాడు. కానీ కాంట్రాక్ట్ మంజూరు చేయడం కోసం ఆయన 11 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ లోకాయుక్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ధార్వాడ్ లోకాయుక్తా ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మొదటి విడతలో భాగంగా రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగానే బీజేపీ ఎమ్మెల్యే చంద్ర లమాణిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఎ మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ అసిస్టెంట్ గురు లమాణిలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాణి నివాసం, కార్యాలయాల్లో లోకాయుక్త పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా, 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.





